Puneet-Vishal | జిమ్లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుతో మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్కుమార్ చేపట్టిన చారిటీ కార్యక్రమాలపై అనిశ్చితి నెలకొంది. పునీత్ రాజ్కుమార్ పలు చారిటీ కార్యక్రమాలు చేపట్టారు. వేల మంది విద్యార్థులకు అవసరమైన నిధులు సమకూర్చేవారు. పునీత్ రాజ్కుమార్ అకస్మిక మృతితో ఆయన కలలు అసంపూర్ణంగానే మిగిలి పోతాయా? అని అంతా భావించారు..
కానీ పునీత్ రాజ్కుమార్ కలలు సాకారం చేయడానికి ఓ నటుడు ముందుకు వచ్చారు. ఆ నటుడు శాండల్వుడ్ నటులు యశ్, సుదీప్.. లేదా మరో నటుడని మీరు భావిస్తున్నారా? అయితే పొరపాటు చేసినట్లే. పునీత్ చారిటీ కార్యక్రమాలు చేపట్టేందుకు కోలీవుడ్ నటుడు ముందుకు వచ్చారు.. ఆయనే విశాల్. తమిళనటుడైన విశాల్.. పునీత్ రాజ్కుమార్ 1800 మందికి కల్పించిన ఉచిత విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. విశాల్ను కన్నడ నటులు కూడా అనుసరిస్తారని ఆశిద్దాం..
‘పునీత్ రాజ్కుమార్వంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కండ్లలోనే మెదులుతున్నారు’ అని విశాల్ ఎమోషనల్ అయ్యారు. ‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పునీత్కి ఆయన నివాళులర్పించారు. తర్వాత విశాల్ మాట్లాడుతూ పునీత్ రాజ్కుమార్ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాని అన్నారు.
ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పునీత్లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదని చెప్పారు. మేకప్ ఉన్నా, మేకప్ తీసేసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించి.. వృద్ధాశ్రమాల్ని నడిపారని అన్నారు.
ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చునన్నారు విశాల్. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమేనని చెప్పారు. చివరిగా తన కండ్లను కూడా దానం చేశారు. ఇప్పటి వరకూ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా నేను చదివిస్తానని పునీత్కి మాటిస్తున్నా. పునీత్ సేవా కార్యక్రమాలకి నా వంతు చేయూతనందిస్తా అని విశాల్ చెప్పారు.