Nivetha Pethuraj | తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇటీవల జరిగిన ‘సింగ్ గీతం’ సక్సెస్ మీట్లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, కెరీర్లో ఎదుర్కొన్న కష్టకాలం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ‘సింగ్ గీతం’ సక్సెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. 2023లో నేను సినిమాలు పూర్తిగా మానేయాలని అనుకున్నాను. నా జీవితం తప్పుడు దారుల్లో వెళ్తోందని, కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నానని అప్పట్లో అనిపించింది. ఆ సమయంలో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అని వెల్లడించారు.
కానీ ఇప్పుడు ‘సింగ్ గీతం’ సినిమాతో మళ్లీ జీవితంలో సరైన దారిలోకి వచ్చాను. ఈ సినిమా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. నాగ్ అశ్విన్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. బహుశా హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ సినిమా మంచి ఫలితం ఇస్తుందని నమ్మాను. సినిమా చూసిన తర్వాత నేను భావోద్వేగానికి లోనై ఏడ్చాను అని చెప్పారు. నివేదా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తప్పు నిర్ణయాలు తీసుకున్నాను , “సినిమాలు మానేద్దాం అనుకున్నాను”, “హిమాలయాలకు వెళ్లిపోదాం అనిపించింది” వంటి మాటలు ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల గురించేనా అనే సందేహాలను అభిమానుల్లో రేకెత్తిస్తున్నాయి.
కొంతమంది నెటిజన్లు ఆమె విఫలమైన రిలేషన్షిప్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం జీవితంలో ఎదురైన ఒత్తిళ్లు, కెరీర్ పరమైన నిరాశల గురించే మాట్లాడి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై నివేదా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఏదేమైనా, ఒక దశలో సినిమాలకు గుడ్బై చెప్పాలనుకున్న నివేదా పేతురాజ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో చురుకుగా కనిపించేందుకు సిద్ధమవుతుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ‘సింగ్ గీతం’తో ఆమెకు కొత్త ఆరంభం లభించిందని, ఇకపై మరిన్ని మంచి పాత్రల్లో ఆమెను చూడాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.