Nithya Menen | ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత నిత్యా మీనన్ తన సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. నటిగా ఇప్పటికే విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ‘కేయూరి ప్రొడక్షన్స్’ (Keyuri Productions ) పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియోలో తన నిర్మాణ సంస్థ లక్ష్యాలు, దృక్పథం గురించి నిత్యా మీనన్ స్పష్టత ఇచ్చారు. కేవలం వాణిజ్య పరమైన సినిమాలకే పరిమితం కాకుండా, బలమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, లోతైన భావోద్వేగాలను కలిగించే పాత్రలు, సమాజంపై ప్రభావం చూపగల కథాంశాలకే తన బ్యానర్ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, అది ప్రేక్షకులతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచే శక్తి కలిగిన మాధ్యమమని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఏడాది వరుసగా మూడు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నిత్యా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన ముద్ర వేయాలని సంకల్పించుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ కింద ఎలాంటి ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించకపోయినా, ముందుగా తనకు ఉన్న నటనా కమిట్మెంట్లను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నటిగా కొనసాగుతూనే, అభిరుచి గల నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు.
విభిన్న కథలను ఎంచుకోవడంలో, ప్రయోగాత్మక పాత్రలను పోషించడంలో నిత్యా మీనన్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇదే ధోరణిని నిర్మాతగా కూడా కొనసాగిస్తారని, కొత్త తరహా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని చిత్ర పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆమె ప్రారంభించిన ఈ కొత్త నిర్మాణ సంస్థ భవిష్యత్తులో కంటెంట్ ఆధారిత, నాణ్యమైన సినిమాలకు వేదికగా మారే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.