‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ పూర్తి వినోదాత్మక చిత్రం. ఇందులో జూనియర్ ఆర్టిస్ట్ కేరక్టర్ పోషించాను. ఈ మూవీ పూర్తిగా ఎంటైర్టెన్మెంట్ మోడ్లో ఉంటుంది. ఈ కథను చెబుతున్న ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నాను’ అంటున్నారు హీరో నితిన్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు.
ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ విలేకరులతో మాట్లాడారు. ‘ఇందులో కథనంతోపాటు కేరక్టరైజేషన్స్ కూడా కొత్తగా ఉంటాయి. వక్కంతం వంశీ ఇప్పటివరకూ రాసిన పాత్రల్లో ఇందులో నాకోసం రాసిన పాత్ర బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కథలో తండ్రీకొడుకుల సెంటిమెంట్ కొత్తగా ఉంటుంది.’ అని చెప్పారు నితిన్. ఇంకా మాట్లాడుతూ ‘డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించారు. ఆయన వచ్చాకే కథ నెక్ట్స్ లెవల్కి వెళ్తుంది.
అసలు ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోరేమో అనుకున్నాం. కానీ వంశీ మాత్రం ఆయనే కావాలని పట్టుబట్టారు. శివానీ, శివాత్మిక బతిమాలడంతో కూతుళ్ల మాట కాదనలేక రాజశేఖర్ అంగీకరించారు. ఆ విషయంలో వాళ్లిద్దరూ మాకు పెద్ద హెల్పే చేశారు. ఆయన పాత్రే ఈ సినిమాకు హైలైట్. ఇందులో సంపత్, రావురమేశ్ పాత్రలు కూడా కొత్తగా ఉంటాయ్’ అని చెప్పారు. హేరిస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలమని, సాంకేతికంగా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని నితిన్ అన్నారు.