తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ కన్నడ వయ్యారి మరో భారీ ప్రాజెక్ట్ను అంగీకరించిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే…నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించబోతున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న ఖరారైందని సమాచారం. గతంలో నితిన్తో కలిసి ‘భీష్మ’ చిత్రంలో నటించిందామె. వీరిద్దరి జోడీ చూడముచ్చటగా ఉందని, తెరపై కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని ప్రశంసలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ హిట్పెయిర్ మ్యాజిక్ను తిరిగి పునరావృతం చేసే ఉద్ధేశ్యంతో రష్మిక మందన్నను కథానాయికగా ఎంచుకున్నారని తెలిసింది. కథలోని నవ్యత నచ్చడంతో రష్మిక మందన్న ఈ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో మిషన్ మజ్ను, గుడ్బై చిత్రాలతో బిజీగా ఉంది.