Karthikeya-2 Movie | యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో కార్తికేయ-2 ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కార్తికే య చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం రూ.20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.
‘కార్తికేయ-2’ తెరకెక్కుతుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి పోటీగా నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా విడుదల కానుంది. నిజానికి థాంక్యూ జూలై 8నే విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రమోషన్ల కారణంగా రెండు వారాలు వెనక్కి జరిగి జూలై 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఎలాంటి పోటీ లేదనుకున్న కార్తికేయ-2కు, థాంక్యూ పోటీగా వచ్చింది.
అయితే తాజాగా నిఖిల్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దిల్రాజు కూడా ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదని కార్తికేయ-2 బృందానికి చెప్పాడట. దాంతో చిత్రయూనిట్ కూడా సినిమాను పోస్ట్ పోన్ చేస్తేనే బెటర్ అని అభిప్రాయ పడుతున్నారట. కార్తికేయ-2 చిత్రాన్ని ఆగస్ట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.