‘ఘోస్ట్’ సినిమా తర్వాత కొన్నాళ్లుగా సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నారు హీరో నాగార్జున. అయితే త్వరలోనే ఆయన తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా ఓ సినిమాకు నాగార్జున అంగీకారం తెలిపారన్న విషయం గతంలోనే వెల్లడైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
జూన్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. మలయాళంలో విజయం సాధించిన ఓ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్గా ఈ సినిమా ఉండనుందట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు చిత్రబృందం నుంచి అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది. ఈ సినిమాతో పాటు నాగార్జునకు శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ సంస్థలో ఓ సినిమాకు అంగీకారం కుదిరింది.