బిగ్స్క్రీన్పై సందడి చేసేందుకు బాలీవుడ్ అగ్రహీరోలు రెడీ అవుతున్నారు. ఆరు నెలల విరామం తర్వాత వెండితెరపై అభిమానుల్ని అలరించేందుకు సమాయత్తమవుతున్నారు. సెకండ్వేవ్ కారణంగా ఏప్రిల్ నుంచి మహారాష్ట్రలో థియేటర్స్ మూతపడ్డాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో అక్టోబర్ 22 నుంచి థియేటర్స్ను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో థియేటర్స్లోనే తమ సినిమాల్ని విడుదల చేసేందుకు ఇన్నాళ్లు ఎదురుచూసిన దర్శకనిర్మాతలు కొత్త రిలీజ్ డేట్స్ను ఆదివారం ప్రకటించారు. షాహిద్కపూర్ హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రాన్ని డిసెంబర్ 31న విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. రణ్వీర్సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘83’ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానున్నది. ఇన్నాళ్లు క్రిస్మస్ రేసులో ఉన్న ఆమిర్ ఖాన్ ‘లాల్సింగ్ చద్దా’ వచ్చే ఏడాది ప్రేమికుల రోజుకు వాయిదాపడింది. పోటీతత్వాన్ని నివారించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అక్షయ్కుమార్ హీరోగా నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ 2022 మార్చి 4న, ‘పృథ్వీరాజ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 21న, ‘రామ్సేతు’ వచ్చే ఏడాది దీపావళికి విడుదలకానున్నాయి. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వాణీల ‘భూల్ బులయ్య-2’ మార్చిలో రానుంది.