శాన్ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 20: ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నది. చందాదారుల సంఖ్య భారీగా పడిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నది. పాస్వర్డ్ షేరింగ్, యాడ్స్తో కూడిన సబ్స్క్రిప్షన్ ప్లాన్లపై గతంలో నిరాకరించిన కొన్ని మార్పులను ప్రస్తుతం అమలు చేయాలని యోచిస్తున్నది. ఖాతాదారులు తమ పాస్వర్డ్లను ఇతరులతో పంచుకొనేందుకు ప్రస్తుతం ఉన్న వెసులుబాటును కుదించనున్నది. దీని ఫలితంగా ఒకే అకౌంట్తో పలువురు నెట్ఫ్లిక్స్ సేవలను వినియోగించుకొనేందుకు వీలుండదు.
దీనితోపాటు తక్కువ ధరలో యాడ్స్తో కూడిన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ మార్పులను వచ్చే ఏడాది నాటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ మంగళవారం రాత్రి వెల్లడించారు. మార్చిన నిబంధనలను పూర్తిస్థాయిలో త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. అయితే, తాజా మార్పులతో చందాదారుల సంఖ్య మరింతగా పడిపోయే అవకాశం ఉందని ఓటీటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ నిబంధనలను ఇప్పటికే పలు ఓటీటీలు అమల్లోకి తీసుకొచ్చినట్టు నెట్ఫ్లిక్స్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ముసురుకొన్న కష్టాలు
గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా నెట్ఫ్లిక్స్ తొలిసారి భారీగా చందాదారులను కోల్పోయింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో తమ చందాదారుల సంఖ్య 2 లక్షలు తగ్గి 22.16 కోట్లకు పడిపోయినట్టు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ సేవలకు రుసుము వసూలు చేయడం మొదలైన తర్వాత చందాదారుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో చందాదారుల సంఖ్య మరో 20 లక్షలు తగ్గవచ్చని సంస్థ అంచనా వేసింది. దీంతో మంగళవారం అమెరికాలో ఆ సంస్థ షేర్ల విలువ 25 శాతం క్షీణించింది. నెట్ఫ్లిక్స్ షేర్ల పతనం బుధవారం కూడా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది ఆ కంపెనీ షేర్ల విలువ సగానికి క్షీణించినట్టు అవుతుంది. కేవలం 4 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే వాటాదారులు 150 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్టు అవుతుంది.