ముంబై: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఇంటికి ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వెళ్లారు. షారూక్ నివాసం మన్నత్ వద్దకు ఎన్సీబీ బృందం చేరుకున్నది. డ్రగ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆర్డర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ను ఇవాళ షారూక్ వెళ్లి కలిసాడు. కొడుకును కలుసుకుని ఇంటికి వచ్చిన తర్వాత.. షారూక్ నివాసానికి ఎన్సీబీ అధికారులు వెళ్లారు. క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో.. ఆర్మన్ దొరికాడు. అయితే ఈ కేసులో ఆర్యన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంటికి కూడా ఎన్సీబీ అధికారులు వెళ్లారు. ఆమెకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్కు రెండుసార్లు బెయిల్ తిరస్కరించారు. అక్టోబర్ 26వ తేదీన బాంబే హై కోర్టు ఈ కేసును విచారించనున్నది. అప్పటి వరకు ఆర్యన్ జైలులోనే ఉండనున్నాడు. ఆర్యన్ వాట్సాప్ ఛాట్లో అనన్య పాండే పేరు ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా ఎన్సీబీ విచారించనున్నది.