Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటీటీలో ఆదరణ పొందింది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ చేదువార్తను తాజాగా ఆ సంస్థ ప్రకటించింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రం శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాముడు మాంసాహారి అని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మూవీలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హీరో ముస్లిం అయి ఉండటం, హీరోయిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండటంతో లవ్ జీహాద్ను ప్రోత్సహించేలా ఉందని, ఈ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ‘అన్నపూరణి’ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. .