దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న నయనతార తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఫోర్బ్స్ ముఖచిత్రంపై కనిపించిన తొలి దక్షిణాది నాయికగా నిలిచింది. ఓటీటీ ప్రభావంతో దక్షిణాది చిత్రసీమలో వస్తున్న మార్పులతో పాటు అత్యధిక ఆదరణ కలిగిన హిందీయేతర తారల విశేషాలతో ఫోర్బ్స్ ప్రత్యేకంగా ఓ ఎడిషన్ను విడుదలచేసింది. ఇందులో దక్షిణాది చిత్రసీమ నుంచి కథానాయికల్లో నయనతార మాత్రమే స్థానాన్ని సంపాదించుకున్నది. ఈ జాబితాలో ఆమెతో పాటు కన్నడ హీరోలు యశ్, దుల్కర్ సల్మాన్ మాత్రమే చోటుదక్కించుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంలో ఆమె అందుకున్న విజయాలు, స్టార్డమ్, వృత్తిపట్ల అంకితభావంతో పాటు ఓటీటీలో ఆమెకున్న ఆదరణ ఆధారంగా నయనతారను ఎంపికచేశారు. నయన్ సాధించిన ఘనత పట్ల ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ‘తంగమై(బంగారం) నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. 2018లోనూ ఫోర్బ్స్ టాప్ వంద మంది సెలబ్రిటీల్లో నయనతార ఒకరిగా నిలిచింది.