దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార పంథాయే వేరు. ప్రతీ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటుందీ భామ. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు, సోషల్మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. రాఖీ పండగ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. అకౌంట్ ఆరంభించిన వెంటనే ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం) ఉన్న వీడియోను తొలుత షేర్ చేసింది. దీనికి రెండు మిలియన్ వ్యూస్పైగా వచ్చాయి. గత కొంతకాలంగా నయనతార సినిమాలు, సోషల్మీడియా విషయంలో తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నది. తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘జవాన్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో నయనతార పాల్గొనబోతున్నట్లు తెలిసింది. అలాగే సోషల్మీడియాలో కూడా యాక్టివ్గా ఉండబోతున్నదని ఆమె సన్నిహితులు చెబతున్నారు.