Nayanthara | ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది అగ్ర కథానాయిక నయనతార. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమాలో నయనతార అభినయానికి చక్కటి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ముంబయిలోని ఓ థియేటర్లో సినిమాను వీక్షించింది నయనతార. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. సినిమా వీక్షించిన అనంతరం నయనతార మీడియాతో ముచ్చటించింది.
బాలీవుడ్ అరంగేట్రానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా.. ‘దేనికైనా సరైన సమయం రావాలి. కాస్త ఆలస్యమైనా నా అభిమాన హీరో షారుఖ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో పరిచయం కావడం ఆనందంగా ఉంది. మున్ముందు దక్షిణాదితో పాటు బాలీవుడ్కు కూడా సమాన ప్రాధాన్యతనిస్తా’ అని చెప్పుకొచ్చింది.