ముంబై : విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి బాలీవుడ్ స్టార్ హీరోలపై విరుచుకుపడ్డారు. రూ. వంద కోట్లు తీసుకునే స్టార్లతో సినిమాలు దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించారు. సినిమా బడ్జెట్ పరిమితికి మించి పెరిగిన ప్రతిసారీ ఆయా సినిమాలు ఫ్లాప్లుగా మిగులుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం కావడం లేదని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్దిఖి గుర్తుచేశారు.
బాక్సీఫీస్ లెక్కల గురించి అంచనా వేయడం నిర్మాత బాధ్యతని పేర్కొన్నారు. సినిమా టికెట్ సేల్స్ గురించి నటుడికి ఎలాంటి పట్టింపులూ అవసరం లేదన్నారు. అసలు నటులు బాక్సాఫీస్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇది నటుల అవినీతి కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు. సినిమాల పరాజయంలో నటులు, డైరెక్టర్లు, రచయితల వైఫల్యం లేదని సినిమా బడ్జెట్ దాని హిట్, ఫ్లాప్లను నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.
మంచి కంటెంట్ ఉన్న సినిమా కమర్షియల్గా సక్సెస్ అవుతుందని అన్నారు. నావద్ద కోట్ల రూపాయల డబ్బు ఉన్నా సరైన ఐడియా లేకుంటే అది చిల్లర డబ్బుల స్ధాయికి కుదించుకుపోతుందని చెప్పారు. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రస్తుతం టైగర్ ష్రాఫ్తో కలిసి హీరోపంటి 2లో కనిపించారు. కంగనా రనౌత్ నిర్మాతగా తెరకెక్కుతున్న టికు వెడ్స్ షెరులో నవాజుద్దన్ నటిస్తున్నారు.