ఈ ఏడాది తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (నాట్స్) సన్నద్ధమవుతున్నది. మే 26 నుంచి 28 తేదీ వరకు న్యూజెర్సీలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈసారి వేడుకల్లో అమర గాయకుడు ఘంటసాల, దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరపనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, నటి జయసుధ, హాస్య నటుడు అలీ, గేయ రచయిత చంద్రబోస్, సాయి కుమార్, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ…‘అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం కోసం నిత్యం పనిచేస్తున్నాం. ఈసారి తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. తెలుగు సినిమాకు సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలు ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య గారి శతజయంతి వేడుకలు జరుపబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేకమంది సినీతారలు న్యూజెర్సీ వస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు.