సెకండ్ ఇన్నింగ్స్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు సీనియర్ నటుడు నరేష్. సినిమాలతో పాటు ఓటీటీ వేదికపై కూడా సత్తా చాటుతున్నారు. ఈ ఏడాదితో ఆయన సినీ రంగంలో యాభైఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. నేడు నరేష్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
నేను సినీ వాతావరణంలో పుట్టి పెరిగాను. అదే నా జీవితం కావాలని బలంగా కోరుకున్నా. తొమ్మిదేళ్ల ప్రాయంలో ‘పండంటి కాపురం’ చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ‘నాలుగు స్తంభాలాట’ చిత్రం ద్వారా హీరోగా మంచి పేరొచ్చింది. నా ఫస్ట్ ఇన్నింగ్స్లో అమ్మ విజయనిర్మల, విశ్వనాథ్, బాపు, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహా రావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. వాళ్లే నా కెరీర్కు పునాది వేశారు.
సుదీర్ఘ కెరీర్లో ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నించాను. విజయాలు లభించినప్పటికీ మనసుకు నచ్చిన సినిమాలు చేయలేకపోతున్నాననే చిన్న నిరాశతో తొలి ఇన్సింగ్స్ ముగిసిపోయింది. దాదాపు పదేళ్ల పాటు పరిశ్రమకు దూరమైనా.. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ను మొదలుపెట్టాను. మీ శ్రేయోభిలాషి, గుంటూరు టాకీస్, అ ఆ, దృశ్యం వంటి చిత్రాలతో నా సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది.
రెమ్యునరేషన్ గురించి ఆలోచించను
గత ఏడాది ‘సామజవరగమన’ చిత్రం కొత్త ఊత్సాహాన్నిచ్చింది. లీడ్ రోల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రంతో పాటు ఓటీటీలో చేసిన ఇంటింటి రామాయణం, మాయా బజార్ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. నటుడిగా నేను కోరుకున్న దానికి మించి గొప్ప పాత్రలు లభిస్తున్నాయి. ఒకప్పుడు సేవాభావంతో రాజకీయాల్లోకి వెళ్లాను. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేదు. కథ నచ్చితే నేను రెమ్యునరేషన్ గురించి ఏమాత్రం ఆలోచించను. ప్రస్తుత ట్రెండ్లో విభిన్న తరహా పాత్రలు లభిస్తున్నాయి. కథ నచ్చితే నెగెటివ్ రోల్స్లో నటించానికి సిద్ధమే. మా విజయకృష్ణ బ్యానర్లో త్వరలో ఓ సినిమా అనౌన్స్ చేస్తాం. నటుడిగా ఉన్నంతకాలం పరిశ్రమకు సేవ చేస్తూనే ఉంటాను.