Ante sundraniki Teaser | విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించిన నాని ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో నాని ఇప్పటివరకు వెనకకు తిరిగి చూసుకోలేదు. తన సహజ నటనతో ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ను ఏర్పరచుకున్నాడు. రొటీన్ భిన్నంగా విభిన్న కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ సినిమాపైన ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.
‘సుందర్ ప్రసాద్ మీ అబ్బాయే కదండి.. అవునండి వాడే మా వంశోద్ధారకుడు’ అంటూ టీజర్ ప్రారంభమైంది. పంచకట్టులో ఉన్న నానిని చూసి హర్షవర్ధన్ ఛమత్కారంగా ‘దెబ్బ తగిలి ఈ డ్రెస్ వేసుకున్నావా.. డ్రెస్ వేసుకున్నాక దెబ్బతగిలిందా’ అని అడుగుతాడు. దానికి నాని ‘మా ఇంట్లో ఆచారం ప్రకారం ఎవరు సముద్రం దాటి వెళ్ళివచ్చిన రెండు రోజులు అందరు ఇలాగే వేసుకుని తిరుగుతారు.. చాలా సార్ అంటూ’ కోపంగా చెప్పే సమాధానం వాళ్ళ ఆచారాలు నానికి ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలుస్తుంది. ‘బాబుకు అసులు బాలేదండి.. చూడండి వైకుంఠపాళిలో పాముల్లాగా ఉన్నాయి గండాలు.. ఒకటి దాటితే ఇంకోటి’ అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే సంభాషణలు నాని పాత్రలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో తెలియజెప్తున్నాయి. నీకు ద్విచక్ర వాహన గండం ఉందంట అంటూ నరేష్ చెప్పగా ద్విచక్ర వాహన గండం ఏంటమ్మా, రోడ్డు మీద గుంటుంటే అది నా తప్ప అస్సలు ప్రపంచంలో ఏ కుర్రాడైనా ఇలాంటి బండేసుకుని తిరుగుతాడా.. అంటూ స్కూటర్ను తన్నడం వంటివి నాని ఫ్రస్టేషన్ను తెలుపుతున్నాయి.
‘నాన్న గురించి తెలియదా నీకు.. మీ ఇద్దరి పెళ్ళి విషయంలో డెసీషన్ నాదే’ అంటూ వచ్చిన డైలాగ్స్ నజ్రియా ఫాదర్ ఎంత స్ట్రిక్ట్ అనేది తెలుస్తుంది. ‘ఏంటి నవ్వావా.. ఇంకొంచెం నవ్వితే ఇటు వైపు లైట్స్ అన్ని ఆర్పేస్తారు.. మా వాడికి కూడా కరెంట్ సేవ్ అవుతుంది’ అంటూ నాని రొమాంటిక్గా చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడిగా , నజ్రీయా క్రిస్టియన్గా నటించింది. వీళ్ళిద్దరి ప్రేమకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? లేదా? అనే నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తుంది. టీజర్ చివర్లో నీకింకా అసలు విషయం చెప్పలేదు? అంటూ నాని, హర్షవర్ధన్కు చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నట్ల మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.