Nandana | ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘నందూస్ వరల్డ్’ నందనను పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. వీసా రెన్యువల్స్, లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో లుకౌట్ నోటీసులు జారీ కావడంతో.. బ్రిటన్లో నివసిస్తున్న నందన హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివ క్రాంతికుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన వీసా రెన్యువల్తో పాటు తన భార్యకు లండన్లో ఉద్యోగం ఇప్పించేందుకు అవసరమైన సీఓఎస్ ఇప్పిస్తామని నందన, ఆమె భర్త మధుకర్ హామీ ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ హామీతో వారి వద్ద నుంచి మొత్తం రూ.15 లక్షలు తీసుకున్నారని, అయితే అనంతరం వీసా రెన్యువల్ గానీ, ఉద్యోగానికి సంబంధించిన సీఓఎస్ గానీ ఇప్పించకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది డిసెంబరులో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పోలీసులు నందనను ఏ-1, ఆమె భర్త మధుకర్ను ఏ-2, ఆమె మామ మోహన్రావును ఏ-3గా పేర్కొన్నట్లు సమాచారం.
కేసు నమోదైన తర్వాత నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో.. వారి కదలికలను గుర్తించేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. నందన ఆచూకీ కోసం పోలీసులు ఆమె మామ మోహన్రావును కూడా విచారించినట్లు సమాచారం. అయితే తన కుమారుడు, కోడలు ఎక్కడ ఉన్నారనే విషయం తనకు తెలియదని ఆయన చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు 41 నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్లో నివాసం ఉంటున్న నందన సోమవారం హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆమెపై లుకౌట్ నోటీసులు ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చెందిన లేడీ ఎస్సై సత్యావతిను హైదరాబాద్ ఎయిర్పోర్టుకు పంపించారు. అక్కడ నందనకు 35 బీఎన్ఎస్ నోటీసులు అందించినట్లు పోలీసులు తెలిపారు. నందనను మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నట్లు సీఐ ఎ. సుబ్రహ్మణ్యం తెలిపారు. అక్కడ ఆమెను కేసుకు సంబంధించిన అంశాలపై పోలీసులు విచారించే అవకాశం ఉంది.