‘సినిమా థియేటర్ లకు ప్రేక్షకులు రావడం లేదంటే నేను నమ్మను. సినిమా బాగుంటే వాళ్లు తప్పకుండా ఆదరిస్తారు. గొప్ప చిత్రాలతోనే ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చగలం‘ అని అన్నారు హీరో ఎన్టీఆర్. ఆయన అతిథిగా ‘బింబిసార‘ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆరట్స్ పతాకంపై హరికృష్ణ కె నిర్మించారు. వశిష్ఠ్ దర్శకుడు. ఆగస్ట్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నది. శుక్రవారం జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ…’రెండున్నరేళ్ల క్రితం అన్నయ్య కళ్యాణ్ రామ్ ఫోన్ చేసి ఒక కొత్త కథ విన్నాను. నువ్వు ఒకసారి విని ఎలా ఉందో చెప్పు అని వశిష్ఠ్ ను నా దగ్గరకు పంపాడు. ఆ కథ విన్నాక, ఇంత పెద్ద సినిమాను కొత్త దర్శకుడు ఎలా తెరకెక్కిస్తాడో అనే భయం మొదలైంది. రీసెంట్ గా సినిమా చూశాను. తను కథ ఎంత బలంగా చెప్పాడో అంతకంటే బాగా తెరకెక్కించాడు.
ఇలాంటి సినిమా చేయడం సులువైన విషయం కాదు. సినిమా చూసేప్పుడు నేను ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యానో, రేపు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడూ అలాగే స్పందిస్తాడు. ఇవాళ ప్రేక్షకులను సంతృప్తి పరచడం కష్టంగా మారింది. ఎంతో గొప్ప సినిమాను రూపొందిస్తే తప్ప వాళ్లు ఇష్టపడటం లేదు. అలా మెప్పించే ప్రయత్నం చేసిన ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నా. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసార ముందు, తర్వాత అని చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఆయన ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో తమ్ముడిగా నాకు తెలుసు. ఈ క్యారెక్టర్ ను ఆయన తప్ప మరెవరూ చేయలేరు అనిపించింది. సినిమా థియేటర్ లకు ప్రేక్షకులు రావడం లేదనే విషయాన్ని నేను నమ్మను. గొప్ప సినిమా తెరకెక్కిస్తే మీరు తప్పకుండా ఆదరిస్తారు.
ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ ఊపిరి పోయాలని కోరుకుంటున్నా’ అన్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…’ఈ కార్యక్రమానికి తమ్ముడు ఎన్టీఆర్ రావడం సంతోషంగా ఉంది. తాతయ్య ఎన్టీఆర్ ‘పాతాళభైరవి‘, బాలకృష్ణ బాబాయ్ ‘భైరవద్వీపం‘, చిరంజీవి గారి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి‘ వంటి సోషియో ఫాంటసీ చిత్రాలను మనం ఇష్టంగా చూశాం. అలాంటి ఒక మంచి జానపద చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావాలని చేసిన ప్రయత్నమే ఈ ‘బింబిసార‘. ఈసారి మిమ్మల్ని నిరాశపర్చను. ఈ చిత్రంతో తప్పకుండా విజయాన్ని సాధించబోతున్నాం.
ఈ ఏడాది శత జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని తాతయ్య ఎన్టీఆర్ కు అంకితం ఇస్తున్నాం. ఆగస్ట్ 5న థియేటర్ లో సినిమాను చూడండి’ అన్నారు. దర్శకుడు వశిష్ఠ్ మాట్లాడుతూ…’నాపై నమ్మకం ఉంచి ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాత హరికృష్ణకు, హీరో కళ్యాణ్ రామ్ కు థాంక్స్. ఈ సినిమా మీకొక కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుందని చెప్పగలను’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయికలు కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.