బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. కాజల్ అగర్వాల్, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. శనివారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ను 108కి పైగా థియేటర్స్లో విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా టీజర్ సాగింది. ‘రాజు ఆని ఎనకున్న వందలమంది మందను జూయిస్తడు, మొండోడు ఆనికున్న ఒకే ఒక గుండెను జూయిస్తడు..అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి..ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది’ అంటూ తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్లో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ…‘ఇది తెలంగాణ నేపథ్య కథ కాబట్టి అక్కడక్కడా హిందీ డైలాగ్స్ పెట్టాం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎలా కనిపించబోతున్నారు అనే దానికి టీజర్ ఒక నమూనా మాత్రమే. ఈ దసరా పండుగకు ‘భగవంత్ కేసరి’ ఎంటర్టైన్ చేస్తాడు. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అన్నారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ…‘ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి. ఈ సినిమా మా సంస్థకు పేరు తెచ్చే చిత్రమవుతుంది. దసరాకు విడుదలయ్యే మా చిత్రం వసూళ్లలో రికార్డులు సాధిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అర్జున్ రాంపాల్, నిర్మాత హరీష్ పెద్ది, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్బీకే 109 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు.