Namratha Shirodkar | టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్లో మహేశ్బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు. పెళ్లైన తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పిన నమత్ర.. పిల్లలు, కుటుంబ బాగోగులు చూసుకుంటూ మహేశ్బాబుకు సంబంధించిన వ్యాపారాలను నిర్వహిస్తూ బిజినెస్ విమెన్గా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నమ్రత.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్ చేశాను. మోడలింగ్ బోర్ కొట్టడంతో సినిమా పరిశ్రమ వైపు వచ్చా. నటిగా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశా. ఆ సమయంలోనే మహేశ్ను కలిశా. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మహేశ్బాబు నేనూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వం పొందడం ఓ గొప్ప అనుభూతి. భార్యాభర్తలుగా మా మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుంది. పిల్లలు ఏమడిగా నేను నో చెబుతుంటా. ఆయన మాత్రం వాళ్లను బాగా గారాబం చేస్తారు. ఏది అడిగినా కాదనరు. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్నే అడుగుతుంటారు. ఈ విషయంలో మాత్రం మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి. సితార అన్ప్లాన్డ్ బేబీ. తను వచ్చాకా జీవితమే మారిపోయింది. తనపట్ల మహేశ్ చాలా సంతోషంగా ఉన్నారు’ అని తెలిపారు. ఇక మహేష్ నటించిన సినిమాల్లో తనకు పోకిరి అంటే చాలా ఇష్టమని.. ఆ మూవీలో బుల్లెట్ దిగిందా లేదా అనే పంచ్ డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని నమ్రత చెప్పుకొచ్చారు.
2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ చిత్రంలో మహేశ్-నమ్రత కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిరురించి అది కాస్తా ప్రేమకు దారితీసింది. అనంతరం 2005 ఫిబ్రవరి నెలలో వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.