Delhi Highcourt | టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆన్లైన్ వేదికలపై ఆయన పేరు, ఫొటోలతో పాటు, వాయిస్ ఇతర గుర్తింపు లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అనధికారికంగా దుర్వినియోగం చేయకుండా రక్షించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ ప్లాట్ఫామ్లలో తన వ్యక్తిత్వాన్ని (Personality Rights) తప్పుగా వాడుకుంటున్నారని ఇది తన గౌరవాన్ని, ప్రతిష్టను దిగజారుస్తుందని నాగార్జున ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తన పేరు, ఇమేజ్ని వాడుకుంటున్నారని పిటిషన్లో తెలిపాడు. అయితే ఈ పిటిషన్ని నేడు విచారించిన హైకోర్టు నాగార్జున పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
నాగార్జున వ్యక్తిత్వ లక్షణాలను అనధికారికంగా ఉపయోగించే లేదా అభ్యంతరకరమైన సెట్టింగ్లలో చూపే పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై న్యాయస్థానం నిషేధం విధించింది. అలాగే పిటిషన్లో గుర్తించిన వెబ్లింక్లను 72 గంటల్లోగా తొలగించాలని ఇంటర్మీడియరీలకు (YouTube, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు) కోర్టు ఆదేశించింది. అయితే తనకు రక్షణ కల్పించినందుకు నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు తన న్యాయవాదుల బృందానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలాంటి ఉత్తర్వులనే పొందారు.