అగ్ర నటుడు నాగార్జున తన ప్రతిష్టాత్మక వందవ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రా.కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి నాగార్జున కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఇంకా ఈ సినిమా పేరును ఖరారు చేయలేదని, షూటింగ్ మాత్రం 45శాతం పూర్తయిందని నాగార్జున తెలిపారు. సున్నా నుంచి కోటీశ్వరుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఇందులో చూస్తారని, తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని, ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అనీ నాగార్జున చెప్పారు. ఇదిలావుంటే.. ఈ సినిమాలో నాగార్జున పాతికేళ్ల నుంచి 60ఏండ్ల వరకూ రకరకాల వయసుల్లో కనిపిస్తారట. ముఖ్యంగా పాతికేళ్ల యువకుడిగా కనిపించేందుకు ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని వాడుతున్నట్టు తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.