కథాంశాల్లో నవ్యతకు పెద్దపీట వేస్తారు అగ్ర కథానాయకుడు నాగార్జున. ఇటీవలే ‘ది ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగార్జున తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘పోరింజు మరియమ్ జోస్’ చిత్రాన్ని నాగార్జున తెలుగులో రీమేక్ చేయబోతున్నారని తెలిసింది. ఇద్దరు స్నేహితుల కథగా రూపొందిన ఈ చిత్రం మూడేళ్ల క్రితం మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి రీమేక్ చేయబోతున్నారని తెలిసింది. ఈ చిత్రం ద్వారా డైలాగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారని సమాచారం. శ్రీనివాస చిట్టూరి నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంటారని తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలో వెల్లడికానుంది.