‘నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్నగారి సినిమా ‘మూగమనసులు’తో నాకు బాగా పరిచయం. అదే ఇష్టంతో నేను ‘జానకి రాముడు’ చేశాను. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. గత జన్మలు అనేది మన సంస్కృతిలో ఉండిపోయిన కథ’ అన్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. మంగళవారం జరిగిన ‘గత వైభవం’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్.ఎస్.దుష్యంత్, అషికా రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సింపుల్ సుని దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తెలుగు రాష్ర్టాలతో పాటు ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..నాలుగు జనరేషన్ల కథతో ఈ సినిమా తీశారని, ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించారు. నాలుగు జన్మలకు సంబంధించిన ఈ కథలో స్క్రీన్ప్లే చాలా కొత్తగా ఉంటుందని హీరో దుష్యంత్ తెలిపారు. అన్ని వాణిజ్య విలువలు కలబోసిన ప్రయోగాత్మక చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా ఫాంటసీ సినిమా తెలుగులో రాలేదని నిర్మాత చైతన్య రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.