‘ఈ కథలో ఉండే బాధని అఖిల్ తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు. నేను నిర్మాతను కాబట్టి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నా. షూటింగ్ టైంలోనే ఫుటేజ్ చూపించారు. ఇదొక గొప్ప సినిమా అవుతుందని అప్పుడే అనుకున్నా’ అన్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. ఆయన తనయుడు అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తున్నది.
మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ‘నేను ఇంతగా ఇన్వాల్వ్ అయి చేసిన చివరి చిత్రం ‘మనం’. అది నాన్న కోసం చేశాను. ఇప్పుడు నా కొడుకు కోసం ‘లెనిన్’ చేశాను.
ప్రేమతో, ఇష్టంతో చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమాలో కొత్త అఖిల్ను చూడబోతున్నారు. భావోద్వేగాలు పండించడం మొదలుకొని డైలాగ్ డెలివరీ వరకు అఖిల్ కొత్తగా కనిపిస్తాడు. సినిమా చూసిన కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఈ నెల 10న వస్తున్నాం.. కొడుతున్నాం.. మనోడు కొడుతున్నాడు’ అని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.
మన మూలాలకు దగ్గరగా ఉండే కథ ఇదని, అంతటా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని హీరో అఖిల్ అన్నారు. ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో కనిపిస్తాడని, అదే సినిమాకు ప్లస్పాయింట్ అని, నాగార్జునగారు చెప్పినట్టే హిట్ కొట్టబోతున్నామని సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. అఖిల్ తొలిసారి గ్రామీణ యువకుడి పాత్రలో నటించిన చిత్రమిదని, ఈ సినిమా విషయంలో నాగార్జునగారి సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు తమన్, కథానాయిక భాగ్యశ్రీ బోర్సే తదితరులు మాట్లాడారు.