నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ నాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. బుధవారం జరిగిన ఈ చిత్ర ప్రెస్మీట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఈ సినిమాతో మా ప్రయాణాన్ని గురించి మీతో పంచుకుంటూనే ఉన్నాం. టికెట్ రేట్లు సహా చాలా విషయాలు చెప్పాం. నేను మాట్లాడిన అంశాల్లో కొన్ని అపార్థాలకూ దారితీశాయి. ఇటీవల ‘విక్రమ్’, ‘మేజర్’లకు ఎంత టికెట్ రేట్స్ పెట్టారో ఈ సినిమాకూ అవే ధరలు నిర్ణయించాం. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు మినహాయిస్తే ఇకపై అన్ని సినిమాలకు ఇవే ధరలు కొనసాగించాలని మా నిర్మాతల సమావేశంలోనూ అనుకున్నాం.
సింగిల్ స్క్రీన్స్లో జీఎస్టీతో కలిపి 150, మల్టీప్లెక్స్లో 200 రూపాయలుగా ధరలు ఉంటాయి. మంచి టీమ్తో దర్శకుడు విక్రమ్ ఈ సినిమాను రూపొందించారు. మూడు విభిన్న గెటప్స్లో నాగ చైతన్య నటన ఆకట్టుకుంటుంది. నేను ఎన్నో సినిమాలు నిర్మించాను గానీ ఈ సినిమాకు పడిన కష్టం మరే చిత్రానికీ పడలేదు. నాలుగు రోజులు షూటింగ్ చేస్తే మళ్లీ నెలల పాటు లాక్డౌన్ వచ్చి పడేది. అలా శ్రమించి చేసినా మంచి ఔట్పుట్ వచ్చింది. సినిమా ఫలితం కోసం వేచి చూస్తున్నాం’ అన్నారు. హీరోయిన్ మాళవికా నాయర్ మాట్లాడుతూ…‘మనకు కృతజ్ఞత అనేది ఉండాలనే అంశం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. నేను ఎవరితో పనిచేయాలని కోరుకున్నానో వాళ్లతో పనిచేసే అవకాశం వచ్చింది. ఒక మంచి విషయాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాం. ఈ చిత్రంలో పార్వతీ అనే పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటా.
చైతూతో కలిసి నటించడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ…‘దిల్ రాజు లాంటి నిర్మాత లేకుంటే ఇలాంటి సినిమా రూపొందించడం కష్టం. నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. అతని పర్ఫార్మెన్స్ కూడా మీ అందరికీ బాగా నచ్చుతుంది. అతనితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. బీవీఎస్ రవి మంచి కథను అందించారు. మాళవికా అందమే కాదు ప్రతిభ గల నటి. పీసీ శ్రీరామ్తో నాకిది మూడో సినిమా. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా తీర్చిదిద్దారు’ అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ…‘ఇలాంటి కథల్ని పేపర్ మీద ఎంత చదివినా ఆ ఫీల్ రాదు. సినిమాగానే చూడాలి. అప్పుడే అనుభూతి చెందగలం. అందమైన ప్రేమ కథని ఈ సినిమాలో చూస్తారు. రాశీ, మాళవికా పాత్రలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అలాగే థమన్ మ్యూజిక్, ఇతర టెక్నీషియన్స్ పనితనం మెప్పిస్తుంది. ఎక్కువ లొకేషన్స్లో సినిమా చిత్రీకరించాం, అలాగే కథలో అనేక లేయర్స్ ఉంటాయి. చెప్పాల్సిన అంశాన్ని సూటిగా చెప్పాం. ఎక్కడా కథ సాగదీసినట్లు ఉండదు. థియేటర్లో మా సినిమాను చూడండి’ అన్నారు.