Naga Babu | టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తాజా హెల్త్ అప్డేట్ ఇచ్చారు. గురువారం పిఠాపురంలో జనసేన ముఖ్య నాయకులతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని, వచ్చే నాలుగు నుంచి వారం రోజుల్లో విధుల్లోకి తిరిగి చేరే అవకాశముందని తెలిపారు. డాక్టర్ల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.
పిఠాపురం అభివృద్ధిపై మాట్లాడుతూ గత రెండేళ్లలో సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేసినట్లు నాగబాబు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. అయితే వర్మ వివాదంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఈ సమావేశంలో స్థానిక జనసేన నేతలు పిఠాపురంలో ఉన్న సమస్యలను నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఫైవ్ మ్యాన్ కమిటీ పనితీరు సరిగా లేదని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు, కళ్యాణ మండపం నిర్మాణం వంటి డిమాండ్లు వినిపించారు. అయితే ఈ సమయంలో పార్టీ అంతర్గత విషయాలపై నేతలు మాట్లాడటంపై నాగబాబు అసహనం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఎవరూ ప్రశ్నించకపోవడంపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. “నేను ఇక్కడికి వివాదాలు మాట్లాడటానికి రాలేదు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కరు కూడా అడగలేదు. మీకు అసలు కొంచమైనా సెన్స్ ఉందా?ఈ నియోజకవర్గం కోసం ఆయన ఇంత కష్టపడుతుంటే, ఆయన పరిస్థితి గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదా?” అంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న జనసేన నాయకులు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక వైద్యుల సూచనల ప్రకారం పవన్ కళ్యాణ్ మరో వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. పూర్తి కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశముందని వైద్యులు సూచించారు. త్వరలోనే ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.