ఉదయ్ శంకర్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య 12 గంటల్లో జరిగే కథ ఇది. విశాఖపట్నంలో ఔట్డోర్ లోనే 95 శాతం షూటింగ్ చేశాం. ఈ చిత్రంలో రాజారాం అనే పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఇఫ్ ఐ డై అనే ఒక యాప్ గురించి చర్చించాం.
యుద్ధ సమయంలో సైనికులు తాము చనిపోతున్న పరిస్థితుల్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలని ఉన్నతాధికారులకు, నాయకులు పంపించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ యాప్ నేపథ్యంగానే కథ సాగుతుంటుంది. మంచి సినిమాకు చిన్నా పెద్దా అనే తేడాలు లేవు. ‘కాంతారా’ అనే కన్నడ సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. భోజ్పురి సినిమా అయినా ఫర్వాలేదు కథ బాగుండి, రెండు గంటలు ప్రేక్షకులు చూసేలా ఉంటే తప్పక ఆదరణ పొందుతుంది. తెలుగులో అడివి శేష్, బాలీవుడ్లో ఆయుశ్మాన్ ఖురానాలా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకోవాలని ఉంది. నటుడు మధునందన్ సోదరుడు మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. అన్నారు.