ప్రతీ ఏటా వచ్చే సంక్రాంతే అయినా.. ఈ సారి మాత్రం కాస్త ఎగ్జైటింగ్గా ఉంది. ఓ వెపు రెండు డబ్బింగ్ సినిమాలు.. మరో వైపు మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు. బాక్సాఫీస్ బరిలో నువ్వా.. నేనా అనే రీతిలో తలపడడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాల ట్రైలర్లు విడుదల కాగా.. మూడింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ వంతు వచ్చింది. మైత్రీ సంస్థ తాజాగా ఈ రెండు సినిమాల ట్రైలర్ డేట్లను ప్రకటించింది.
తెలుగు ప్రేక్షకులు ఈ రెండు సినిమా ట్రైలర్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాల మధ్య పోటీ మాములుగా లేదు. ఫస్ట్లుక్ పోస్టర్ల నుండి పాటలు, టీజర్ల వరకు ప్రతీది నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి. 40ఏళ్ళలో వీళ్లిద్ధరు దాదాపు 17సార్లు పోటీ పడ్డారు. అందులో కొన్ని సార్లు బాలయ్య పై చేయి సాధిస్తే.. కొన్ని సార్లు చిరంజీవి పై చేయి సాధించాడు.
ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే అయినా… ఈ సారి ఎందుకో పోటీ రసవత్తరంగా సాగుతుంది. హీరోల గురించి అటుంచితే, అభిమాలు మాత్రం సై అంటే సై అనే విధంగా ఉన్నారు. మా హీరో పోస్టర్ బాగుంది అంటే మా హీరో పోస్టర్ బాగుంది. ఇలా ఈ రెండు సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అభిమానులు కంపేర్ చేసుకుని మరీ ట్రోల్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎవరు హిట్టు కొడతారా అని ఈ ఇద్ధరి అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలను మైత్రీ సంస్థనే నిర్మించింది.
ఈ రెండు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్ డేట్లను మైత్రీ సంస్థ ప్రకటిచింది. వీరసింహా రెడ్డి ట్రైలర్ జనవరి 6న రిలీజ్ కానుండగా.. వాల్తేరు వీరయ్య ట్రైలర్ జనవరి 7న విడుదల కానుంది. ఇక బాలయ్య సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. చిరు ఒక రోజు లేటుగా వస్తున్నాడు. కాగా ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించడం గమనార్హం.
ఇక ‘వీర సింహా రెడ్డి’ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. పైగా వీరిద్ధరూ ‘అఖండ’, ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత రాబోతుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక చిరు కూడా ‘గాడ్ఫాదర్’ వంటి హిట్ తర్వాత రానుండటంతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.