Suniel Shetty | జమ్ము కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం (Pahalgam Attack) ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మరణించారు. ఇక ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. పలు నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ ఉండడంతో పాటు కశ్మీర్ పర్యటక రంగంపై చాలా ఎఫెక్ట్ పడింది. కశ్మీర్ టూర్కి వెళ్లాలి అనుకునే వారి ప్లాన్లను ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ పర్యటక రంగంకి అండగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి.
ఉగ్రవాదులకు భారతీయులు భయపడరని చాటేందుకు, పర్యాటక రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు తన తర్వాతి సెలవులను కాశ్మీర్లోనే గడుపుతానని సునీల్ శెట్టి ప్రకటించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. విద్వేషాలు, భయాల ద్వారా సమాజాన్ని విడదీయాలని చూసే శక్తుల పట్ల జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల ప్రదానోత్సవంలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ” మనకు మానవ సేవయే అతి పెద్ద దైవ సేవ. పైనున్న దేవుడు అన్నీ చూస్తున్నాడు. భారతీయులుగా మనం ఐక్యంగా ఉండాల్సిన సమయమిది. భయాన్ని, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి ఉచ్చులో మనం పడకూడదు. హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారి మాటలను అసలే నమ్మవద్దు. కాశ్మీర్ మనది.. అది ఎప్పుడు మనదిగానే ఉంటుంది. ఎప్పటికీ మనదే అని వారికి చూపించాలి. అందుకే సైన్యం, నాయకులు, ప్రజలందరూ ఈ ప్రయత్నంలో ఉన్నారు” అని అన్నారు.
అలాగే ప్రజలందరూ తమ తర్వాతి సెలవులను కాశ్మీర్లోనే ప్లాన్ చేసుకోవాలని ఆయన కోరారు. “పౌరులుగా మనం ఒక్కటే చేయాలి. మన తర్వాతి సెలవు కాశ్మీర్లోనే ఉంటుందని నిర్ణయించుకోవాలి. మనకు భయం లేదని వారికి చూపించాలి అని ఆయన అన్నారు. అవసరమైతే కాశ్మీర్ను సందర్శించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అధికారులకు తెలియజేసినట్లు కూడా సునీల్ శెట్టి వెల్లడించారు. సునీల్ శెట్టి రాబోయే చిత్రాల్లో ‘కేసరి వీర్’ (2025), ‘వెల్కమ్ టు ది జంగిల్’ (2025), ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ (2025) ఉన్నాయి.