నందమూరి తారకరత్న మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ తారకరత్న (Taraka Ratna) పార్థీవదేహానికి సినీ నటుడు అలీ (Ali) నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేం చివరిసారిగా కలిసి నటించిన సినిమా ఎస్5 (S5 No Exit). ఈ సినిమా కోసం మేం 10 రోజులు కలిసి పనిచేశామన్నారు.
తారకరత్న అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా.. సీనియర్ ఆర్టిస్టులంటే అపారమైన గౌరవం. తారకరత్న మంచి హృదయమున్న మనిషి. తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ అందరినీ శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు. తారకరత్న, నా తమ్ముడు.. చిన్ననాటి స్నేహితులు. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. తారకరత్న హీరో కాకముందు మా ఇంటికి వచ్చేవాడు. ఒకేరోజు 9 సినిమాలు లాంఛ్ చేసిన అరుదైన ఘనత తారకరత్న సొంతం.
మేమిద్దరం కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించాం. తారకరత్న మన మధ్య లేడన్న వార్త వినగానే చాలా బాధపడ్డా. తారకరత్న ఆస్పత్రిలో చేరారని తెలిసిన వెంటనే.. ఆయన కోలుకోవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఈ రోజు ఆయన లేడన్న వార్తను మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
తారకరత్న పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారకరత్నను తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.