Adarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (AK47) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ తప్పుకోగా, ఆ స్థానంలోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి తొలుత ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రమేశ్వర్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలుస్తుంది. సృజనాత్మక విభేదాల వలనో లేదా డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలనో హర్షవర్ధన్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం.
ఇక హర్షవర్ధన్ తప్పుకోవడంతో, త్రివిక్రమ్ తన ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్. తమన్ను రంగంలోకి దించారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్ కావడంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే తమన్తో కలిసి త్రివిక్రమ్ సరికొత్త మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 2న (గాంధీ జయంతి సందర్భంగా) విడుదలయ్యే అవకాశం ఉంది.