శ్రియా శరణ్, శర్మన్ జోషి, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ను మంగళవారం ముంబయ్లో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ‘ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో చక్కటి సంగీతం, ఆసక్తికలిగించే డ్రామా, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, మంచి సందేశం ఉంటుంది. ఈ చిత్రంలో శ్రియా శరణ్, శర్మన్ జోషి సంగీత, నృత్య టీచర్లుగా నటించారు. గ్రేసీ గోస్వామి, ఓజు బారువాతో పాటు మరికొంత మందికి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో ఓ మ్యూజికల్ ప్లేని ఏర్పాటు చేస్తారు.
సమాజం, టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలపై పెంచుతున్న ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వడం కోసం వారు చేసే ప్రయత్నాల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఆద్యంతం సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. నేటి తరం విద్యార్థుల మీద తల్లిదండ్రులు, గురువులు, సమాజం మోపుతున్న ఒత్తిడిని సున్నితంగా, అర్థవంతంగా, సంగీత ప్రధానంగా చెప్పే ప్రయత్నమే మ్యూజిక్ స్కూల్. ఈ సినిమాలో పదకొండు పాటలున్నాయి. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇందులోని మూడు పాటలను అత్యద్భుతమైన సౌండ్తో డిజైన్ చేశాం. హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించాం. మే 12న పీవీఆర్ ద్వారా హిందీ, తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’ అన్నారు.