దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా గత కొంతకాలంగా వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తాను కంపోజ్ చేసిన పాటలను అనుమతి లేకుండా మ్యూజిక్ కన్సర్ట్స్లో ఆలపించడం, వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేయడం, సినిమాల్లో ఉపయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపుతున్నారు.
ఈ క్రమంలో ఆయన ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఇటీవలే విడుదలైన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఇళయరాజా కంపోజ్ చేసిన ‘గుణ’ చిత్రంలోని ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ అనే పాటను కొన్ని సందర్భాల్లో ఉపయోగించారు.
తన అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇళయరాజా చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపారు. ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. ఇదిలావుండగా రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ నిర్మాతలకు కూడా ఇళయరాజా ఇటీవలే లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమా టైటిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో తాను కంపోజ్ చేసిన పాటను వాడారని ఇళయరాజా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్కు నోటీసులు పంపించారు. ఇళయరాజా వరుస నోటీసుల పర్వం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.