‘ ‘దండోరా’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నాకు గద్దర్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నా బాధ్యతను పెంచింది. భవిష్యత్లో మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు నాలో ప్రేరణ నింపింది’ అని సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ అన్నారు. మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినా.. వెలుగులోకి రాకపోవడానికి కారణం తాను ఇంట్రావర్ట్ కావడమేనని మార్క్ కె.రాబిన్ అభిప్రాయపడ్డారు. ‘దండోరా’ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం తనను ఉత్తమ సంగీత దర్శకునిగా గుర్తించి అవార్డు ఇవ్వడం కెరీర్ పరంగా కూడా తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం హైదరాబాద్లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు మార్క్ కె.రాబిన్. ‘ ‘దండోరా’ విషయంలో మంచి సంగీతం ఇచ్చేందుకు పురిగొలిపింది ఆ సినిమా కథాంశమే.
అంతిమ సంస్కారాలకు సైతం అడ్డుగా నిలిచే కులవివక్ష, మనషుల్లో మందగిస్తున్న మానవత్వం.. వీటన్నింటి గురించీ దర్శకుడు మురళీకాంత్ వివరించగానే మనసు చలించిపోయింది. భావోద్వేగం నిండిన మనసుతో ‘దండోరా’కు సంగీతం అందించాను. స్థానిక సంగీతంపై నాకు అవగాహన ఉంది. దానికి తగ్గట్టే స్థానిక వాయిద్యాలతోనే మ్యూజిక్ చేశాను. ఆ ప్రభావమే ఇదంతా’ అని పేర్కొన్నారు మార్క్ కె.రాబిన్. డైరెక్టర్ ప్రశాంత్వర్మతో ప్రయాణమే తనను సంగీత దర్శకుడ్ని చేసిందని, కమర్షియల్ సినిమాలకు సంగీతాన్నందించడం తనకిష్టమని, ప్రస్తుతం ‘కథాకళి’ అనే సినిమాతోపాటు ప్రశాంత్వర్మ ప్రొడక్షన్స్కి చెందిన రెండు సినిమాలకు పనిచేస్తున్నానని, ఓ స్టార్ హీరో సినిమాక్కూడా సంగీతం అందించబోతున్నానని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తానని మార్క్ కె.రాబిన్ తెలిపారు.