వికాష్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. విశ్వక్సేన్ కీలక పాత్రను పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రంలో పనిచేసిన అనుభవాలు తెలిపారు నాయికలు ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్. ప్రియా వడ్లమాని మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో నేను రెండు పాత్రల్లో నటిస్తున్నాను.
అందులో ఒకటి చిన్న టౌన్ అమ్మాయి పాత్ర కాగా మరొకటి సిటీ గర్ల్. టౌన్ యువతి పాత్ర చాలా నెమ్మదస్తురాలుగా ఉంటే, సిటీలో పెరిగిన యువతి రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. రెండో పాత్రలోకి నేను ఎలా మారాను అనేది సినిమాలో చూడాలి. ‘హుషారు’ సినిమా తర్వాత రెండేండ్ల విరామం తీసుకున్నాను. నటిగా పేరు తెచ్చే సినిమాల్లో నటించాలని అనుకుంటున్న సమయంలో ఈ చిత్రంలో అవకాశం దక్కింది. నటిగా నాకు గుర్తింపు తీసుకొచ్చి, స్థాయిని పెంచే సినిమా అవుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పింది. నాయిక అయేషా ఖాన్ మాట్లాడుతూ…‘ఇది నాకు తెలుగులో మొదటి సినిమా.
ఈ చిత్రంలో మాయా ఫెర్నాండేజ్ అనే పాత్రలో నటించాను. తెలుగు రాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పేప్పుడు ఇబ్బందులు పడ్డాను. సినిమా చిత్రీకరణలో భాగంగా యాక్సిడెంట్ సన్నివేశాల్లో నాకు నిజంగానే గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో నాకు ఇప్పటిదాకా పెయిన్స్ ఉన్నాయి. అయినా ఓ మంచి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. దర్శకుడి విజన్ మేరకు నటించాను. మీకూ నా క్యారెక్టర్ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పింది.