MSG | సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా రీజినల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి సరికొత్త వసూళ్ల రికార్డులను నెలకొల్పింది. పండుగ సీజన్ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకున్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.దర్శకుడుఅనీల్ రావిపూడి తనదైన శైలిలో హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ విలువలను సమతుల్యంగా మేళవిస్తూ కథను తెరకెక్కించారు.
చిరంజీవి ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్ మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు, పండుగ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్లు థియేటర్లలో ప్రేక్షకుల చేత కరతాళ ధ్వనులు అందుకుంటున్నాయి. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత కె.వి. రావు ఆధ్వర్యంలో చిరంజీవికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ , దర్శకుడు అనిల్ రావిపూడి తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. చిరంజీవి సినీ ప్రయాణం, ఆయన కృషి, అభిమానుల ప్రేమ గురించి వేదికపై పలువురు ప్రశంసలు కురిపించారు.
ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ విలువలు చిత్రానికి మరింత గ్రాండియర్ తీసుకొచ్చాయి. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా పండుగ సాంగ్స్ మరియు ఎమోషనల్ ట్రాక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే బుల్లితెరపై టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు చిన్న తెరపై ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. వయసు పెరిగినా తన ఎనర్జీ, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి మరోసారి తన స్టార్డమ్కు నిదర్శనం చూపించారు. అభిమానుల అంచనాలను మించి ఈ చిత్రం సాధించిన విజయంతో మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది.