వివాహ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పింది ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్. తన స్నేహితుల్లో చాలా మంది పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారని ఈ అమ్మడు పేర్కొంది. ఆమె నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ వెబ్షో ఇటీవల విడుదలైంది. వివాహ బంధం నేపథ్యంలో రూపొందించిన ఈ షోలో మృణాల్ ఠాకూర్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహ బంధం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘మన ఆలోచనలు, అభిరుచులకు దగ్గరైన వ్యక్తి కోసం అన్వేషించాలి.
పెళ్లి విషయంలో హడావుడి నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. కాస్త్త ఓపికతో ఎదురుచూస్తే సరైన భాగస్వామి దొరుకుతాడు. అప్పుడిక పెళ్లి కోసం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వివాహం గురించి జీవితంలోని ఏదో ఒక దశలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎవరికైనా తప్పదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది.