అరంగ్రేటం చేసిన అనతికాలంలోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఈ భామ భారీ చిత్రాల్లో నటిస్తున్నది. అల్లు అర్జున్-అట్లీ కాంబో చిత్రంలో ఈ సొగసరి ఓ కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వరుస భారీ సినిమాలతో ఆర్థికంగా కోరుకున్న స్థాయికి చేరుకున్నప్పటికీ..ఖర్చు విషయంలో మాత్రం పొదుపు పాటిస్తుందట ఈ అమ్మడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా డబ్బుపై నియంత్రణ ఉండాలంటూ మృణాల్ చెప్పిన మాటలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
‘నాకు ఖరీదైన దుస్తులు కొనడం అస్సలు ఇష్టం ఉండదు. వాటి కోసం ఎంతో ఖర్చుపెడతాం. ఏదో ఒక సందర్భంలో ధరించడం తప్ప అవి ఎక్కువ సమయం బీరువాల్లోనే ఉండిపోతాయి. అందుకే దుస్తుల విషయంలో రెండుమూడు వేలకంటే ఎక్కువగా ఖర్చు చేయను. ఫిల్మ్ ఈవెంట్స్కు మాత్రం కాస్త ఖరీదైన డిజైనర్ క్లాత్స్ ధరిస్తాను. అయితే వాటిని అద్దెకు తెచ్చుకుంటాను. అంత డబ్బులు పెట్టి ఎప్పుడూ బట్టలు కొనను’ అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.