సెలబ్రిటీ జీవితాలకు ఇది వ్యక్తిగతం అని చెప్పుకునే హద్దు చాలా చిన్నది. ప్రజా జీవితంలో ఉండే వీరికి ప్రశంసలతో పాటు విమర్శలూ సహజం. కాలంతో పాటు విమర్శించే వేదికలు మారినా పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల సోషల్ మీడియా ఉధృతి పెరిగిన తర్వాత మీమ్స్, ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. వీటిని చాలా సందర్భాల్లో సహించే నాయికలు…కొన్నిసార్లు ధీటుగా స్పందించడం చూస్తున్నాం. అందాల తార మృణాల్ ఠాకూర్ కూడా తాజాగా తనపై ట్రోల్స్ చేస్తున్న కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హీరోయిన్స్ కూడా మనుషులే అనే విషయాన్ని కొందరు మర్చిపోతూ ఉంటారు’ అని ట్వీట్ చేసింది.
తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మృణాల్…అందం, డబ్బు, పేరు ప్రతిష్టలు అవసరం లేదు మంచి వాడైతే చాలు అని తెలిపింది. మరో ఇంటర్వ్యూలో చూడ్డానికి బాగుండాలి అని అంది..ఈ రెండు వీడియోలను మీమ్స్ చేసి ట్రోల్ చేశారు. వారిపై మృణాల్ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కెరీర్లో ఉన్నతస్థితిలో ఉందీ తార. బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నది. తెలుగులో నాని 30వ సినిమా, తమిళంలో సూర్య 42లో నాయికగా నటిస్తున్నది. వీటితో పాటు అక్షయ్ కుమార్ సరసన అతిథిగా మెరిసిన ‘సెల్ఫీ’ ఈ నెల 24న విడుదల కానుంది. ‘గుమ్రా’, ‘పూజా మేరీ జాన్’, ‘పిప్పా’, ‘ఆంఖ్ మిచోలి’ వంటి పలు హిందీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.