Ashok Babu | తెలుగు సినిమా రంగంలో హీరోగా ఎంట్రీ ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడిన వ్యవహారంలో టాలీవుడ్ హిట్ చిత్రం ‘పిల్ల జమిందార్’ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి లపై సైబరాబాద్ పోలీస్ పరిధిలో కేసు నమోదైంది. బాధితుల కథనం ప్రకారం.. ఒక యువకుడిని టాలీవుడ్లో హీరోగా పరిచయం చేస్తామంటూ నమ్మించిన దర్శకుడు అశోక్ బాబు, సదరు యువకుడి తల్లిదండ్రుల నుండి విడతల వారీగా దాదాపు రూ.3.5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే, డబ్బులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా సినిమా ఊసే ఎత్తకపోగా, యువకుడిని హీరోగా లాంచ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనితో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా నిలదీశారు. తీసుకున్న భారీ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించడంతో, బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి (EOW) చెందిన పోలీసులు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. టాలీవుడ్లో ఈ తరహా మోసం బయటపడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.