తన సినిమాలు థియేటర్లో విడుదలవ్వాలని కోరుకుంటానని అంటున్నది బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ. థియేటర్లో సినిమాను చూసిన అనుభూతి ఓటీటీలో దక్కదని ఆమె అభిప్రాయపడింది. థియేటర్కు వచ్చి సినిమా చూడటం నటీనటులకు ప్రేక్షకులు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నట్లు రాణీ తెలిపింది. ఆమె తాజా చిత్రం ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నది.
ఈ సినిమా విజయం నేపథ్యంలో రాణీ ముఖర్జీ మాట్లాడుతూ…‘మా సినిమాకు దక్కుతున్న స్పందనకు సంతోషంగా ఉంది. నేను థియేటర్ కోసమే సినిమాలు చేస్తా. ఓ చిత్రాన్ని థియేటర్లో ఆస్వాదించిన తీరుకు, ఇంట్లో చూసిన విధానానికి అనుభూతిలో తేడా ఉంటుంది. మీరు థియేటర్కు వచ్చి సినిమా చూస్తేనే మా శ్రమకు గౌరవం, ప్రతిఫలం దక్కినట్లు భావిస్తా. అని చెప్పింది.