విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా నటించిన సినిమా ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఉర్వీ సింగ్ నాయికలు. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శశిధర్ చావలి మాట్లాడుతూ…‘మనసున్న ప్రతి వ్యక్తి రాజే అనేది ఈ చిత్రం ద్వారా మేము చెప్పబోతున్నాం. హీరో పాత్ర ఆదర్శవంతంగా ఉంటుంది. సహజంగా మన జీవితాల్లో ఎలా ఉంటామో అలాగే కనిపిస్తాడు. గాలిలో ఎగిరే విమానం ఆ వాయు పీడనాన్ని ఆధారం చేసుకుని బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే ఇంధనం అవసరం లేకుండా ప్రయాణిస్తుంది. ఇలాంటి కాలుష్య రహిత విమాన తయారీ డిజైన్స్ చేస్తుంటాడు హీరో. ఇది నేను ఒక పేపర్ ఆర్టికల్లో చదివి స్ఫూర్తిపొందిన అంశం. నిజంగానే విదేశాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత్రను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ ఇది. నేను అనుకున్న పాత్రకు వందశాతం న్యాయం చేశాడు శరణ్. ఇందులో తండ్రీ కూతురు మధ్య అనుబంధం, ప్రేమికుల మధ్య భావోద్వేగాలు బాగా కుదిరాయి. ఇద్దరు నాయికలకు కథలో ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పారు.