గురువారం హైదరాబాద్లో సమావేశమైన తెలుగు నిర్మాతలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాల్ని స్ట్రీమింగ్ చేసే విషయంలో ఏకాభిప్రాయానికొచ్చామని తెలిపారు. షూటింగ్స్ ఎప్పుడు పునఃప్రారంభించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోవు రెండుమూడు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అగ్ర నిర్మాత దిల్రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇక నుంచి విడుదలయ్యే సినిమాలు ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్ణయం తీసుకున్నాం.
థియేటర్లో రిలీజైన 50 నుంచి 60రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంలో నిర్మాతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. థియేటర్, మల్టీప్లెక్స్లలో స్నాక్స్, బేవరేజెస్ ధరల విషయంలో వాటి యాజమాన్యాలతో మాట్లాడాం. తినుబండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
మల్టీప్లెక్స్, సింగిల్స్క్రీన్స్లో టికెట్ ధరలు తగ్గించడానికి కూడా అంగీకరించారు. అయితే వీపీఎఫ్ ఛార్జీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ఎగ్జిబిటర్స్తో సమావేశం నిర్వహించి తుది నిర్ణయాల్ని ప్రకటిస్తాం’ అని దిల్రాజు అన్నారు.
నిర్మాణ వ్యయం విషయంలో ‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)తో ఓ ఒప్పందం చేసుకున్నామని దిల్రాజు తెలిపారు. ‘ఫెడరేషన్తో కూడా చర్చలు పూర్తయ్యాయి. వాళ్లు కోరుతున్న వేతనాల్ని చెల్లించేందుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారు. షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని తదుపరి సమావేశాల్లో నిర్ణయిస్తాం’ అని దిల్రాజు చెప్పారు.