Ticket Hikes in Telugu | మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ సినిమాతో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న వార్ 2 చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కూలీ సినిమాకు తమిళనాడులో అత్యధిక టికెట్ ధర రూ.190 రూపాయలు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఆ ధర దాదాపు రూ.450 నుంచి రూ.500 వరకు వెళుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిందీ నుంచి వస్తున్న డబ్బింగ్ చిత్రం వార్ 2 కి కూడా హిందీలో రూ.250 టికెట్ రేట్లు ఉండగా.. తెలంగాణలో రూ.400 వరకు ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే రేట్లు కొనసాగితే.. భవిష్యత్తులో ప్రేక్షకులు థియేటర్లకి రావడం మానేసి.. ఓటీటీ లేదా.. పైరసీ వెబ్సైట్లకు అలవాటుపడతారని విశ్లేశకులు భావిస్తున్నారు.