ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకుడు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డా॥ రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, హెబ్బాపటేల్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో ఈ చిత్ర మోషన్పోస్టర్ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో ఇంద్రసేన మాట్లాడుతూ ‘ఈ సినిమాకు రచయిత రాఘవేంద్రరెడ్డి కమర్షియల్ హంగులు కలబోసిన అద్భుతమైన కథనందించాడు. కొన్నేళ్ల నుంచి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్కు బ్రేక్నిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
కథలోని కొత్తదనం నచ్చి ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత షణ్ముగం సాప్పని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ “కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాతో ఇంద్రసేన యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. నా అభిమాన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ వేడుకకు అతిథిగా హాజరురావడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేసినా తాను ఈ సినిమాతో కథా రచయితగా మారానని, రాజకీయాంశాలతో కూడిన విభిన్న చిత్రమిదని రాఘవేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు చిన్నికృష్ణ, నిర్మాత, ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్, ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, జగదీశ్వర్రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీకృష్ణ, భూషన్, మహేష్, మయాంక్ తదితరులు పాల్గొన్నారు.