దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని ఈ నెల 31న రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ఆదిశేషగిరి రావు వెల్లడించారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు నిర్మాత అశ్వనీదత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ…‘మా పద్మాలయ సంస్థకు పునాది ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించినప్పటికీ ఈ సినిమా చిరకాలం గుర్తుండిపోతుంది.
కృష్ణ గారి కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆయన సాహసాలకు ప్రతీక ఈ సినిమా. అభిమానుల కోరిక మేరకు కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ నెల 31న 4కే వెర్షన్లో విడుదల చేస్తున్నాం. కౌబాయ్ చిత్రాల్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. దర్శకుడు కేఎస్ఆర్ దాస్ అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…“మోసగాళ్లకు మోసగాడు’ పాన్ వరల్డ్ సినిమా. అన్ని భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. అలాంటి కౌబాయ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రీ రిలీజ్ చేస్తుండటం సంతోషకరం’ అన్నారు.