Drushyam | హాలీవుడ్ కథలను భారతీయ భాషల్లో రీమేకులు చేయడం సర్వసాధారణం. కానీ తొలిసారి మన భారతీయకథలను హాలీవుడ్ రీమేక్ చేయబోతున్నది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’తో భారతీయ సినిమా ఆస్కార్ దాకా వెళ్లింది. ఇప్పుడు మన కథలు కూడా హాలీవుడ్లో రీమేక్ అవుతుండటం నిజంగా గర్వకారణం. వివరాల్లోకెళ్తే.. మలయాళంలో మోహన్లాల్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా కేరళలో రికార్డు కలెక్షన్లు సాధించి దేశాన్ని ఆకర్షించింది. అదే కథను అదే పేరుతో వెంకటేశ్, మీనా జంటగా తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
కన్నడలో ‘దృశ్య’ పేరుతో, తమిళంలో ‘పాపనాశం’గా రూపొంది, విడుదలైన ప్రతి భాషలో విజయదుంధుభి మోగించిందీ కథ. ఈ కథకు కొనసాగింపైన ‘దృశ్యం-2’ కూడా సూపర్హిట్. భారతీయ భాషల్లో అమోఘ విజయాలను అందుకున్న ఈ కథలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా వీటిని విజయాలే వరించాయి. ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ ంస్థతో కలిసి ఈ కథలతో హాలీవుడ్ చిత్రాలను నిర్మించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి ఈ కథల రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందులో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సివుంది.